పుదుచ్చేరి ఆరోగ్య, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు శాసనసభలో బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్-యానం సరిహద్దులో చిక్కుకున్న 14 మంది యానం నివాసితులకు ప్రవేశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి ధర్నాకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగానే వారి రాకకు అనుమతి ఇచ్చేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆ కొద్దిసేపటికే కేంద్రం కూడా వలస కార్మికులు, కూలీలు, యాత్రికులు, విద్యార్థులు తమ సొంతూళ్లకు పోవడానికి అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిజానికి.. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ నిర్ణయాలు పలుమార్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల కరోనా వైరస్ కారణంగా ఎక్కడో కోడిపిల్లలను వదిలివేసినట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. కానీ.. అది ఫేక్ వీడియో అని తేలడంతో చిక్కుల్లో పడ్డారు. పెద్దస్థాయి నేతలే ఇలా ఫేక్ వీడియోలను షేర్ చేస్తే.. ఎలా అంటూ నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆమె తీరును నిరసిస్తూ ఏకంగా మంత్రి మల్లాడి కష్ణారావు ధర్నాకు దిగడం గమనార్హం.