కరోనా సోకితే అంటరానితనంగా చూడొద్దని, సరైన చికిత్స తీసుకుంటే నయమైపోతుందని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ.. ఈరోజు కర్నూలు జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో ఆయన సీరియస్ అయ్యారు. కరోనా వైరస్ సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని మరోసారి చెప్పారు. కరోనా బారిన పడి మరణించిన వారి అంతిమ సంస్కారాలు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ను వెంటనే ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో కరోనా సోకి మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రిజగన్ సీరియస్గా స్పందించారు. ఈ ఘటన చాలా అమానవీయమని.. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిపై ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన వాళ్లు ఉంటే ఎలా స్పందిస్తామో.. ఇతరులు ఉన్నప్పుడు కూడా అలాగే స్పందించాలని ప్రజలను కోరారు.