భారత్ మరో లెజెండ్ను కోల్పోయింది. నిన్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ఖాన్, నేటి ఉదయం ప్రముఖ బాలీవుడ్ రిషీకపూర్ మృతి చెందారు. ఈ విషాదం నుంచి భారత్ తేరుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా క్రీడా దిగ్గజాన్ని భారత్ కోల్పోయింది. భారత మాజీ ఫుట్బాల్ లెజెండ్, మాజీ కెప్టెన్ చుని గోస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. చుని గోస్వామి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అత్యంత విజయవంతమైన భారత ఫుట్బాల్ కెప్టెన్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన సారథ్యంలోనే భారత్ 1962 ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
1964 ఆసియా కప్లో రన్నరప్గా నిలిచింది. గోస్వామి క్రికెట్ కూడా ఆడారు. బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆయన ఆడారు. 82 సంవత్సరాల ఈ క్రీడాకారుడు కోల్కతాలోని దవాఖానలో గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. కాగా గోస్వామికి భార్య, కుమారుడు ఉన్నారు. గోస్వామి 1956 నుండి 1964 వరకు ఫుట్బాల్ క్రీడాకారుడిగా భారతదేశం తరపున 50 మ్యాచ్లు ఆడాడు. క్రికెటర్గా, 1962 మరియు 1973 మధ్య 46 ఫస్ట్ క్లాస్ ఆటలలో బెంగాల్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన మృతికి క్రీడారంగ, రాజకీయ, అభిమానులు సంతాపం తెలిపారు.