ఓ వైపు కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది.. పిల్లలు, పెద్దలు.. జనమంతా ఇళ్లకే పరిమితమైపోయారు. స్వీయనియంత్రణతో సామాజిక దూరం పాటించాలని, ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని ప్రభుత్వాలు, అధికారులు పదేపదే చెబుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కానీ.. వీటన్నింటినీ పట్టించుకోకుండా గుజరాత్లోని రాజ్కోట్లో ఒక ప్రైవేట్ పాఠశాలను ఈ రోజు ఉదయం తెరిచారు. సుమారు వందమంది విద్యార్థులు పాఠశాలకు హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి.
లాక్డౌన్కు ముందు పాఠశాలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను విద్యార్థులకు చెప్పడానికి ఈ పాఠశాలను తెరిచినట్లు తెలుస్తోంది. అయితే.. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాల యాజమాన్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. జిల్లా పంచాయతీ సమితి చైర్మన్ కేడీ పదారియా స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులకు శిక్ష పడుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే..వందమంది పిల్లలు ఒకే చోటకు రావడంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.