వలస కూలీల తరలింపుపై ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మధ్య శనివారం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. లాక్డౌన్తో ఏపీలో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీలు, కార్మికుల తరలింపుపై చర్చించారు. అలాగే ఒడిశాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌరులను తరలించే విషయమై కూడా చర్చించారు. తమ రాష్ట్రానికి చెందిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు కల్పించి ఆదుకున్నందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. *ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. అంతేకాక మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేస్తున్నాం. కోవిడ్ వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్ధితుల్ని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది. ధన్యవాదాలు’అని నవీన్పట్నాయక్ అన్నారు.
దీనిపై సీఎం జగన్ కూడా భరోసా ఇచ్చారు. *మీ అభ్యర్థనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం నవీన్ పట్నాయక్ జీ. దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. రిలీఫ్ క్యాంపులలో ఉంటున్నవారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం* అని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు.