కరోనా వైరస్కు విరుగుడు కనిపెట్టే పనిలో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అధ్యయనానికి సిద్ధమవుతోంది. దేశంలో రెండు నెలలుగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్లో ఏదైనా మార్పు (మ్యుటేషన్) జరిగిందా..? అనే విషయాన్ని తెలుసుకునేందుకు అ పరశోధన చేయనుంది. సార్స్–కోవిడ్2 మార్పును పసిగట్టడం ద్వారా వ్యాక్సిన్ను సులభంగా తయారు చేయవచ్చునని, ఆ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఉపయోగపడు తుందని సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు. కరోనా వైరస్ మార్పుచెందిందా? లేదా అనే విషయాన్ని అంచనావేయడానికి కొవిడ్–19 రోగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్ష చేస్తారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో గరిష్ట వ్యత్యాసం 0.2 నుంచి 0.9 మధ్యలో ఉన్నట్టు మరో శాస్త్రవేత్త వెల్లడించారు.
ఇతర దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారత్లోకి వివిధ రకాల కరోనా వైరస్లు వస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం మూడు రకాలైన వైరస్లు దేశంలో ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. ఒకటి వూహాన్ నుంచి, మరొకటి ఇటలీ నుంచి, మరో వైరస్ ఇరాన్ నుంచి వచ్చిన రకం. అయితే ఇరాన్ నుంచి వచ్చిన వైరస్ మాత్రం చైనా వైరస్ని పోలి ఉందట. అయితే మనదేశంలోకి ప్రవేశించిన వైరస్ ప్రధాన లక్షణాలను కనుక్కోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందట. భారత్లో ఈ వైరస్ వైరస్ త్వరగా మార్పులకు గురికాలేదనీ ఐసీఎంఆర్లోని ఎపిడెమాలజీ అండ్ కమ్యూని కబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ రమణ ఆర్.గంగాఖేద్కర్ గతంలోనే చెప్పారు. కాగా, వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఆరు భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు 70 వ్యాక్సిన్లు పరీక్షించగా మూడు మాత్రం క్లినికల్ ట్రయల్స్ దశకు చేరాయని నిపుణులు చెబుతున్నారు. అయితే 2021 కన్నా ముందు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టేమనని అంటున్నారు.