భారతదేశంలో కొవిడ్-19 మహమ్మారి ప్రభావం తీవ్రరూపం దాల్చుతోంది. ప్రతీ రోజూ సుమారు 2వేలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కొవిడ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 2,573 కొత్త కేసులు నమోదుకాగా 83 మరణాలు సంభవించాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,836కు చేరుకుంది. ప్రస్తుతం 29,685 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 11,762మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆ బులెటిన్లో పేర్కొంది. ఇక మరణించిన వారి సంఖ్య 1,389కు చేరుకుంది. అయితే.. గత కొద్దిరోజులుగా ప్రతీ రోజు రెండువేలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా.. తమిళనాడులో ఈ రోజు రికార్డు స్థాయిలో కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా నేడు 527 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికావర్గాలు చెబుతున్నాయి. మరోవైపు..లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల మద్యంషాపులు తెరిచారు. అయితే.. వందలు, వేల సంఖ్యలో మందుబాబులు షాపుల వద్దబారులు తీరడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు వైరస్ వ్యాప్తిని మరింత వేగవంతం చేస్తాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు.