కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. చేతిలో పనిలేక, తినేందుకు తిండిలేక వందలు, వేలు, లక్షల సంఖ్యలో పేదలు, వలస కూలీలు, కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. తెలంగాణలో ఏ ఒక్కరు కూడా ఆకలిలతో అలమటించొద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మంత్రి కేటీఆర్ వేగవంతంగా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో తాత్కాలిక, మొబైల్ అన్నపూర్ణ క్యాంటిన్ల సంఖ్యను ఏకంగా 342కు పెంచారు. దీంతో నగరంలోని పేదలు, వలస కార్మికులు, కూలీల కడుపులు నిండుతున్నాయి. ఈ క్యాంటిన్ల ద్వారా దాదాపుగా రోజుకు లక్షల మందికిపైగా ఆహారం అందుతోంది.
ఈ క్రమంలోనే నిన్న అంటే సోమవారం నాడు ఒక్కరోజే ఏకంగా ఒక లక్షా యాభై ఆరువేల మందికి ఆహారం అందించారు. ఆకలిగొన్న అభాగ్యుల పాలిట నగరంలోని అన్నపూర్ణ క్యాంటిన్లు అక్షయపాత్రగా మారుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి కేటీఆర్, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అన్నం అడిగిన ప్రతీ ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంతో మంత్రి కేటీఆర్, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏర్పాట్ల పట్ల పేదలు, వలస కార్మికుల, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నారు.