దేశవ్యాప్తంగా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా నిలుస్తోంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావం క్రమంగా తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ దీంతో పంజాబ్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1451కి చేరుకుంది. మొత్తం కేసుల్లో 1293 యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు. ఇద్దరు రోగులు ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారని పంజాబ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలుచేస్తున్నారు.
ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోడ్లపైకి ఎవరూ రాకూడదని సూచనలు జారీచేశారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో షాపుల ముందు మందుబాబులు వందలు, వేల సంఖ్యలో బారులు తీరారు. ఈ నేపథ్యంలో మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.