కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే.. ఆగిపోయిన పదో తరగతి పరీక్షలపై తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తరువాతే పదో తరగతి పరీక్షలపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ కూడా సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాట్టిస్తూ పరీక్ష కేంద్రాలను కుందించాలా లేక యథావిధిగా సాగించాలా అనే విషయంపై సీఎం జగన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
అయితే.. పరీక్షలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం టెలి కాన్ఫరేన్స్ ద్వారా తరగతుల నిర్వహణ జరుగుతోందని, ఆన్లైన్లో పదో తరగతి క్లాసులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. మంత్రి ప్రకటనతో విద్యార్థుల్లో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.