విశాఖ నిద్రపోలేదు. రాత్రంతా కంటికి కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపింది. మృత్యువు మళ్లీ ఎటువైపు ఎలా ముంచుకొస్తుందోనని భయంభయంగా జాగారం చేసింది. రాత్రివేళ గ్యాస్ మరోసారి లీక్ అయిందన్న పుకార్లతో మళ్లీ జనాలు ఉరుకులు పరుగులు తీశారు. రాత్రివేళ రోడ్లపైకి వచ్చిన ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో వెళ్లిపోయారు. విశాఖలోని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారు జామున ప్రమాదకరమైన స్టెరిన్ గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడివాళ్లు అక్కడ కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11మంది మృతి చెందారు. వందలాది మంది కేజీహెచ్ ఆస్పత్రితతోపాటు మరికొన్ని ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో తక్కువ మొత్తంలో న్యూట్రిలైజర్స్ ఉండడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రత్యేకంగా గుజరాత్ అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి న్యూట్రిలైజర్స్తో తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంల గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు గురువారం రాత్రి ప11గంటల సమయంలో గుజరాత్ నుంచి ప్రత్యేక బృందం విశాఖకు చేరుకుంది. న్యూట్రిలైజేషన్ కెమికల్స్తో చేరుకున్న ఆ బృందం వెంటనే చర్యలు చేపట్టింది. గ్యాస్ లీకేజీ గాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చినట్టేనని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని చెబుతున్నాయి.