విశాఖలోని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన స్టెరిన్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 45 మంది చిన్నారులు ఉన్నారు. అలాగే మరికొన్ని ఆస్పత్రుల్లో మూడు వందలమందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలామంది వెంటిలేటర్పైనే ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి కూడా గ్యాస్ లీక్ అయినట్లు పుకార్లు రావడంతో ప్రజలంతా మళ్లీ పరుగులు తీశారు. రోడ్లమీదకు వచ్చి రాత్రంతా అక్కడే గడిపారు. మరికొందరు వాహనాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలాగే.. గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. గ్యాస్ లీకేజీని అపేందుకు చర్యలు తీసుకుంటోంది. గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి న్యూట్రిలైజ్ కెమికల్స్తో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది. మరోవైపు కంపెనీ సమీపంలో ఐదు గ్రామాల ప్రజలను సింహాచలంలో ఏర్పాటు చేసిన పునరావాసకేంద్రాలకు అధికారులు తరలించారు.