లాక్డౌన్ కారణంగా దేశంలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. రూ.7500 చొప్పున పేదల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్లో మీడియాతో మాట్లాడారు. మనం ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, ఇది విమర్శలు చేసుకునే సమయం కాదని, అందరం కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై పోరాడాల్సిన సమయమని ఆయన అన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో పాదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్గాంధీ హితవుపలికారు.
అయితే.. మే 17న లాక్డౌన్ ముగుస్తుందని, లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ అనేది ఆన్ ఆఫ్ స్విచ్ కాదని, దీనిని కేంద్రం అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు కేంద్రం అనుసరించే వ్యూహం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కరోనా మహమ్మారి వృద్ధులకు, డయాబెటిస్, రక్తపోటుతో బాధపడేవారికి ఎంతో ప్రమాదకరమైనదని, అంతకుమించి ఇది ప్రమాదకరమైన వ్యాధేమీ కాదని, తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న ప్రజల్లో మనం మానసిక స్థైర్యం నింపాల్సిన అవరం ఉందని రాహుల్గాంధీ పేర్కొన్నారు.