లాక్డౌన్ పుణ్యమా అని రహదారులన్నీ ఖాళీగా ఉండడంతో అత్యవసర పనులపై బయల్దేరిన వారి వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్లకు చెందిన కోళ్లపూడి ధనలక్షి్మ (46), కోటేశ్ (38), పెండేల సాయి సందీప్ శుక్రవారం వేకువజామున కార్లో హైదరాబాద్ నుంచి బాపట్ల బయల్దేరారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ధనలక్ష్మి, కోటేశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన సాయి సందీప్ను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కోదాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.