కరోనా వైరస్ ఎవరికీ అంతుచిక్కకుండా వ్యాప్తి చెందుతోంది. మన శరీరంలోకి వైరస్ చొరబడినా లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. ఇది చాలా తీవ్ర పరిణామంగా పరిగణిస్తున్నారు వైద్యులు. ఓ కుటుంబం మొత్తానికి వైరస్ సోకింది. అయినా ఏ ఒక్కరిలోనూ లక్షణాలు మాత్రం కనిపించలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని వారందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కుటుంబంలోని రెండేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు మొత్తం 16 మందికి కరోనా మహమ్మారి సోకింది. అయితే.. వారెవరికీ అనారోగ్య లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి.. వామిఖ్ ఖాన్ అనే వ్యక్తి సోదరుడు కలిసిన వ్యక్తికి కరోనా వచ్చిందని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఖాన్ సోదరుడికి ఏప్రిల్ 10న కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో ఖాన్ ఇంటికి ఏకంగా 40 మంది పోలీసులు, అధికారులు చేరుకున్నారు.
ఆ కుటుంబంలోని మొత్తం 16 మందిని ఏప్రిల్ 14వ తేదీన మొరాదాబాద్ నగరంలోని ఐఎఫ్టీఎమ్ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు తరలించారు. అయితే.. వారికి ఎవరికీ కూడా లక్షణాలు కనిపించలేదు. అయితే.. కరోనా పరీక్షలు చేపట్టగా అందరికీ కరోనా పాజిటివ్ తేలడంతో వైద్యవర్గాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే వారందరినీ తీర్థంకర్ మహావీర్ విశ్వవిద్యాలయంలోని ఐసోలేషన్ వార్డుల్లోకి తరలించారు. ఏడు రోజుల చికిత్స అనంతరం ఒక్కొక్కరికీ నెగిటివ్ రావడం ప్రారంభమైంది. మూడు సార్లు పరీక్ష నిర్వహించిన అనంతరం నెగిటివ్ రావడంతో అందరినీ మే 1వ తేదీన ఇంటికి పంపించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.