కరోనా వైరస్ను అదుపుచేయడంలో పట్టుసాధించిన కేరళకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత గురువారం గల్ఫ్ నుంచి కేరళకు వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకడంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. వెంటనే వారిని కొచ్చి, కోజికోడ్లలోని కొవిడ్-19 ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.
అంతేగాకుండా.. వారితో వచ్చినవారందరినీ వెంటనే క్వారంటైన్కు తరలించినట్లు తెలిపారు. అయితే.. కేరళలో కేసులు దాదాపుగా జీరోకు చేరుకుంటున్నాయని అనుకుంటున్న తరుణంలో ఈ కేసులు నమోదు కావడంతో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, కేరళలో ఇప్పటివరకు మొత్తం 503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు.