ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా కరోనా వైరస్ రెచ్చిపోతోంది. ఊహకందని వేగంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఘనా దేశంలో కూడా భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘనాలోని అట్లాంటిక్ సముద్రతీర నగరమైన తేమాలోని ఒక చేపల ప్రాసెసింగ్ కర్మాగారంలో పనిచేసే కార్మికుడి నుంచి ఏకంగా 533 మంది ఇతర కార్మికులకు కరోనావైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆదేశ అధ్యక్షుడు నానా అకుఫో అడో వెల్లడించారు. అయితే.. ఆ ఒక్కడి నుంచి ఇన్ని వందలమందికి కరోనా ఎలా సోకిందన్నది మాత్రం అధికారులకు అంతుచిక్కడం లేదు.
ఈ నేపథ్యంలో వారు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఘనా దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కేసుల్లో ఈ ఘటన కేసులు ఏకంగా 11.3శాతం ఉండడం గమనార్హం. అలాగే.. దేశంలో ఇప్పటివరకు 160,501 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఘనా అధ్యక్షుడు వెల్లడించారు. ఇక ఇప్పటివరకు కరోనా బారి నుంచి 22మంది మరణించగా.. 492 మంది కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆఫ్రికాలోని ఇతర దేశాలకన్నా ఘనాలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆయన తెలిపారు.