కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇళ్లకే పరిమితమైన వినియోగదారులను ఆకట్టుకోవడానికి పలు బ్యాంకులు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మెడిసిన్ను తమ కార్డులతో కొనుగోలు చేస్తే 15 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తామంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) భారీ ఆఫర్ ఇచ్చింది. *ఈ కష్టకాలంలో ఫార్మసీ బిల్లుల భారం కాస్త తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. మీకు సమీపంలోని అపోలో ఫార్మసీ స్టోర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులతో మెడిసిన్ కొనుగోలు చేయడం ద్వారా 15 శాతం దాకా డిస్కౌంటు పొందండి* అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అలాగే.. ఎస్బీఐ కూడా ఆఫర్ ఇచ్చింది. *అపోలో 24/7 నుంచి హెల్త్ చెకప్ చేయించుకోండి. యోనో ఎస్బీఐ యాప్ ద్వారా కొన్ని ల్యాబ్ టెస్టులపై మంచి డిస్కౌంట్లు పొందండి* అని ఎస్బీఐ పేర్కొంది. అటు, అక్షయ తృతీయ రోజున తమ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ ఇచ్చింది. రూ. 10,000 విలువ పైబడిన ప్రతీ కొనుగోలుపై 5 రెట్లు రివార్డ్ పాయింట్లు ఇస్తామని, పీఎం కేర్స్ ఫండ్కు రూ. 100 విరాళంగా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా.. బ్యాంకులు తమ నిబంధనలను కూడా కొంతమేరకు సడలిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసుకున్నా జూన్ 30 దాకా ఎటువంటి చార్జీలు విధించబోమంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.