మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో 50శాతం మంది ఖైదీలను జైళ్ల నుంచి తాత్కాలికంగా విడుదల చేయాలని రాష్ట్ర హై పవర్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం 35,239 మంది జైళ్ల లోపల ఉన్నారు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి తాత్కాలిక బెయిల్పై, తాత్కాలిక పెరోల్పై దోషులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉంటున్నాయి.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 23,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులోనూ దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో కరోనా వైరస్ మరింతగా రెచ్చిపోతోంది. ఆ తర్వాత గుజరాత్లో 8,541, తమిళనాడులో 8002 కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,604 కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,827 కు పెరిగింది, మరణాల సంఖ్య 2,294 కు చేరుకుంది.