ఏపీలో మద్యం ఆదాయం భారీగా పెరిగింది.. ఇదే సమయంలో వినియోగం చాలా వరకు తగ్గిపోయింది. ఇదేమిటని అనుకుంటున్నారా..? మీరు చదువుతున్నది నిజమే. ఏపీలో మద్యం అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. వినియోగం తగ్గిపోయింది. ఏపీలో క్రమంగా మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ సంకల్పం నెరవేరుతోందని చెప్పొచ్చు. కేంద్రం ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత ఏపీలో మద్యం షాపులను తెరిచిన విషయం తెలిసిందే. అయితే.. మద్యం ధరలను సర్కార్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. మొదట 25శాతం పెంచారు. షాపులు తెరిచిన తొలిరోజు భారీగా మందుబాబులు షాపుల ముందు బారులు తీరిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై వెంటనే అప్రమత్తం అయిన సర్కార్ మళ్లీ 50శాతం మద్యం ధరలను పెంచింది. మొత్తంగా 75శాతం ధరలు పెంచింది. మద్యనిషేధం అమలు కోసమే ధరలను పెంచామని సర్కార్ ప్రకటించింది.
ఇప్పుడు సర్కార్ చెప్పిందే నిజమవుతోంది. ఏపీలో అమ్మకాలు బాగా పడిపోయాయి. ఇదే సమయంలో ఆదాయం భారీగా పెరిగింది. ఏపీలో ఈ ఆరు రోజుల్లో 3.17లక్షల లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి.. గత ఏడాది ఆరు రోజుల్లో ఏకంగా 7లక్షల కేస్లు అమ్ముడుపోయాయి. ఇక బీర్ల విషయానికి వస్తే ఈ ఆరు రోజుల్లో లక్ష కేసులు అమ్ముడుపోగా, గత ఏడాది ఆరు రోజుల్లో ఏకంగా 8.4లక్షల కేస్లు విక్రయించారు. ఇవి అధికారిక లెక్కలు. అంటే.. ఏపీలో మద్యం అమ్మకాలు సగానికి సగం పడిపోవడం గమనార్హం. ధరలుపెంచడం వల్ల ఆదాయం పెరిగిందని, వినియోగం తగ్గిందని.. ఇదే విషయాన్ని జగన్ సర్కార్ ముందే చెప్పిందని.. ఇప్పుడు అదే నిజమైందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.