ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఖోస్ట్ ప్రాంతంలో వైద్య సిబ్బంది లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడులో ఖోస్ట్ పబ్లిక్ హెల్త్ కమిషనర్ సహాయకుడు, ముగ్గురు వైద్యులు సహా మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ ఆర్మీ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. గాయపడిన అందరినీ చికిత్స నిమిత్తం ఖోస్ట్లోని సివిల్ హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున ఈ పేలుడు చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితుల్లో వైద్యసిబ్బందే లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు బాంబుదాడుకలకు పాల్పడడం కలకలం రేపుతోంది.