ఇటీవల తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో దాదాపుగా 24శాతం మద్యం అమ్మకాలు తగ్గాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే.. మద్యనిషేధంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందులో భాగంగానే మద్యం షాపులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నాని, దాదాపుగా 33శాతం షాపులను తగ్గించామని ఆయన పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకంగా మద్యం అమ్మకాలు బాగా తగ్గిపోయాయని. గతంలో 23లక్షల కేసులు అమ్ముడుపోగా.. అవికాస్తా ఇప్పుడు 10లక్షలకు తగ్గాయని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చేశామని, గతంలో వారం రోజులు తాగే వాళ్లు ఇప్పుడు రెండు రోజులు మాత్రమే తాగుతున్నారని.. ఇది ఎంతో మంచి పరిణామమని ఆయన అన్నారు. ఈరోజు చేపట్టిన *మన పాలన-మీ సూచన* కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాలను వెల్లడించారు. ఇలా తాము అదికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో అవినీతిలేని గొప్ప వ్యవస్థను ప్రజలకు అందించామని జగన్ అన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటికే సేవలు అందించేలా మార్పులు తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఏడాది కాలంలో 4లక్షల ఉద్యోగాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అనినీతిలేని పాదర్శకత ఉన్న వ్యవస్థ.. గ్రామ సచివాలయ వ్యవస్థ అని ఆయన అన్నారు. అవ్వాతాతలకు నేరుగా ఇంటివద్దనే పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులు జాబితాను గ్రామ సచివాలయాలలోనే అందుబాటులో ఉంచుతున్నామని.. ఇలా అవినీతిలేని గొప్ప వ్యవస్థను ప్రజలకు అందించామని సీఎం జగన్ ఉద్ఘాటించారు.