కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా చిత్రసీమ పూర్తిగా స్తంభించింది. సినీ పరిశ్రమలో దినసరి వేతనం పొందే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి అండగా టాలీవుడ్ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) అనే సంస్థ కూడా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ ఛారిటీ ద్వారా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మరోవైపు కొందరు ప్రముఖులు కూడా సినీ కార్మికులకి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా సినీ కార్మికులకి నిత్యావసర సరుకులు అందించారు. 400 మందికి బియ్యం, పప్పు, నూనె, మాస్క్లు ఇచ్చారు.
ఇటీవల కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకి జగపతి బాబు ఎన్–95 మాస్కులు, శానిటైజర్లను అందించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో సీపీ వి.సి.సజ్జనార్ను కలిసి వాటిని అందించిన విషయం తెలిసిందే.