భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటివరకు అంటే శనివారం రాత్రి వరకు 2లక్షల 40వేలపైగా చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇందులో సగం కేసులు దేశంలోని మొదటి నాలుగు మెట్రోపాలిటన్ క్లస్టర్లు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలో నమోదు కావడం గమనార్హం. అలాగే... మరో మూడు ప్రధాన పట్టణాలు అహ్మదాబాద్, ఇండోర్, పూణేలలో కూడా అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ఏడు నగరాల్లో ఏకంగా 60 శాతం కేసులు ఉన్నాయి. 80 శాతం మరణాలు ఈ నగరాల్లోనే సంభవించాయి.
ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో మొత్తం కేసుల సంఖ్య 1.14 లక్షలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులలో దాదాపు 48 శాతంగా ఉంది. మరణాల సంఖ్య 3,150 కి చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా మరణాల సంఖ్యలో 46 శాతానికి పైగా ఉంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) నుండి 62,615 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబై నగరంలో మాత్రమే 47,354 కేసులు ఉన్నాయి.