ఓ వైపు దేశంలో కరోనా వైరస్ తో సంపాదన లేక పేద ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు, సెలబ్రెటీలు కాస్తో కూస్తో ఆదుకుంటున్నారు. ఈ మద్య వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకొని అంతో ఇంతో పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ వృద్దున్ని హాస్పిటల్ బిల్లు కట్టలేదని కట్టిపడేశారు ఆసుపత్రి వర్గం. మధ్యప్రదేశ్ లోని షజాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. చికిత్స బిల్లు రూ. 11,000 కట్టలేదని ఓ వృద్ధుడిని ఆస్పత్రి బెడ్పై తాళ్లతో కట్టేసారు. హాస్పిటల్ లో చేరేముందు రూ 5000 డిపాజిట్గా చెల్లించామని, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగడంతో బిల్లు చెల్లించేందుకు తమ వద్ద డబ్బు లేదని బాధితుడి కుటుంబ సభ్యులు వాపోయారు.
అయితే ఆసుపత్రి వర్గం వారు మాత్రం వేరేలే చెబుతున్నారు. రోగి మూర్ఛ వ్యాధితో బాదపడుతుండటంతో తనకు తాను హాని చేసుకోకుండా ఉండడానికి మంచానికి కట్టివేశామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అంతే కాదు మానవతా దృక్పథంతో వారి బిల్లును ఆస్పత్రి మాఫీ చేసిందని వైద్యులు తెలిపారు. ఈ ఫోటోలు కాస్త వైరల్ కావడంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆస్పత్రిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.