నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలు చెపుతున్నాయి. అధికార పార్టీ ఎంపీగా ఉన్న ఆయన అధికార పార్టీనే ఇరుకున పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో ఆయన బీజేపీలో పని చేసి ఉండడంతో కేంద్ర పెద్దలతో ఆయనకుండే చనువు, పార్లమెంటు సాక్షిగా ఇంగ్షీషు మీడియం చదువులపై వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం., రాష్ట్రంలో ఇసుక రేట్లపై విమర్శలు చేయడం, తిరుపతి వెంకన్న భూముల వ్యవహారంలో వైసీపీని వ్యతిరేకించడం ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక కాంట్రవర్సీ వివాదం రేపుతున్నారు.
ఆయన దృష్టిలో అది ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం నానా ఇబ్బందులు పడుతోంది. తాజాగా జగన్ చుట్టూ ఉన్న ఓ సామాజిక వర్గం పేరు పరోక్షంగా ప్రస్తావిస్తూ వాళ్లంతా కోటరీగా ఏర్పడుతున్నారని టార్గెట్ చేశారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణమ రాజు పై క్రమశిక్షణా చర్యలకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఆయనకు షో కాజ్ నోటీసులు జారీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆయన నుంచి సరైన సమాధానం లేకపోతే అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోనుందని వైసీపీ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి.