కరోనా మహమ్మారి ఎంతో మందిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటోంది. కరోనా దెబ్బతో కుటుంబాలు కకావికలం అవ్వడంతో పాటు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఎంతో హాయిగా కాపురాలు చేసుకుంటూ చీకు చింతా లేకుండా ఉన్న కుటుంబాలను కరోనా నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా కాటుతో ఓ కుటుంబం కాకావికలమైంది. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం క్వారంటైన్ కేంద్రంలో ఓ మహిళ మృతి చెందింది.
జగ్గడిగుంట పాలెంలోని గంగానమ్మపేటలో ఈనెల 18న భర్తకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రైమరీ కాంటాక్ట్స్గా అతడి భార్య, ఇద్దరు పిల్లలను క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించారు. అయితే గత రాత్రి ఒకటిన్నర సమయంలో సడెన్గా భార్యకు గుండె పోటు రావడంతో ఆమె క్వారంటైన్ సెంటర్లోనే మృతి చెందింది. వెంటనే అధికారులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరోవైపు కరోనా బారిన పడిన భర్త.. ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.