ఏపీలో ఇప్పటికే కొన్ని చోట్ల వార్డు వలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. అనేక కారణాలు , రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక నేతల ఒత్తిళ్లతో వీరు పదవులకు రాజీనామాలు చేస్తుండడంతో భారీగా ఈ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ప్రాథినిత్యం వహిస్తోన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒకే వార్డులో ఏకంగా ఐదుగురు వలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీనికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బందే అన్న ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజా సమస్యలను వలంటీర్లు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోవడం లేదని.. దీంతో స్ధానికులు వలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే వారు మనస్థాపానికి గురై తమ పదవులను రాజీనామాలు చేసినట్టు సమాచారం. వీరు ముందుగా మునిసిపల్ కమిషన్ శ్రీనివాసరావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ఉపయోగం లేకపోవడంతోనే పదవులు వదులుకున్నట్టు సమాచారం. పైగా అంబటి నియోజకవర్గంలో ఐదుగురు వలంటీర్ల రాజీనామా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ వర్గాల్లో దీని గురించి పెద్ద చర్చ నడుస్తోంది.