నెల్లూరు జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్లపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. జిల్లాలోని బాలాయపల్లి, వెంకటగిరి మండల పోలీస్ స్టేషన్లపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇటీవల బాలాయపల్లి మండలం, భైరవరం గ్రామంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందారు. నాయుడుపేట రెడ్ జోన్ లో తలదాచుకున్న మృతి చెందిన వ్యక్తిపై కొందరు నిందితులు దాడి చేసి గాయపరిచారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం రెండు, మూడు స్టేషన్లోనే ఉంచారు.
ఇక ఈ నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా వెంకటగిరి, బాలాయపల్లి స్టేషన్ మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేసినట్టు సమాచారం. కరోనా పరీక్షల్లో వెంకటగిరి, బాలాయపల్లి పోలీసుస్టేషన్లలోని పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా జిల్లా వైద్య అధికారులు నిర్దారించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.