ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై సొంత పార్టీ నేతల నుంచే అనేక విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాను మూడు ముక్కలుగా చేయడం తగదని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో విజయనగరం, సాలూరు, అనంతపురం జిల్లాలో పుట్టపర్తి, పెనుగొండ, చిత్తూరు జిల్లాలో మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాల కోసం డిమాండ్లు వస్తున్నాయి.
వాస్తవానికి పైన చెప్పినవి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలు కావు. ఇది లా ఉంటే కర్నూలు జిల్లాలో దూరంగా ఉండే ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని.. లేనిపక్షంలో తమను పక్కనే ఉన్న కర్నాటకలో కలిపి వేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. తాము జిల్లా కేంద్రానికి దూరంగా ఉంటామని.. తమకు కొత్త జిల్లా ఇవ్వని పక్షంలో తమను కర్నాటకలో కలిపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ ప్రకటన ఇప్పుడు ఆయనకు సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందిగా మారిందన్నది వాస్తవం.