ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత ఏడాది అధునాతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 15 రోజుల క్రితం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో పనిలేకుండా నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర వేయడం ద్వారా నగదు తీసుకునే సౌకర్యం తీసుకోని వచ్చింది.
ఆధార్తో అనుసంధానమై ఉన్న ఖాతాదారునికి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉంటే, ఆధార్ డేటాబేస్లో చివరిసారి ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా కొన్ని బ్యాంకులు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, మరికొన్ని బ్యాంకులు రూ.5 వేలు తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కొద్ది రోజులుగా ఖాతాల పెంపుపై దృష్టి సారించారు. ఈ ఖాతాల్లో గరిష్టంగా రూ.లక్షకు మించి దాచుకోవడానికి వీలుండదు. అందుకని వీటిని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రూ.లక్షకు మించి ఉన్న నగదు నేరుగా సేవింగ్స్ ఖాతాలోకి వెళ్తుంది, అవసరమైనప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న బ్యాంకింగ్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ రామ్ భరోసా తెలిపారు.
పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించడంలో ఏపీ సర్కిల్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10.33 లక్షల ఖాతాలతో రూ.21.59 కోట్ల డిపాజిట్లను సేకరించింది నాయి ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడు నెలల్లోనే 6.91 లక్షల ఖాతాలను ప్రారంభించాం. ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క