ఐటీ దాడులు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, విశాఖ నగరాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. నగరాల్లో పన్నులు ఎగవేతకు పాల్పడిన సంస్థలపై.. కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ , విశాఖపట్నంలోని 15 సంస్థలపై.. 23 కేంద్ర ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి.
ఆయా సంస్థల కార్యాలయాలను జల్లెడ పట్టాయి. పలు పత్రాలు.. ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక అంచనాల మేరకు 12 కోట్ల రూపాయల సెంట్రల్ ఎక్సైజ్ పన్ను.. సేవా పన్ను, జీఎస్టీకు చెందిన పన్ను పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లోని ఓ సినీ ప్రొడక్షన్ కార్యాలయంపై సోదాలు చేసారు. దాదాపు 60 లక్షల రూపాయల మేర పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించారు.
అయితే ఆ సంస్థ.. తక్షణమే ఆ మొత్తాన్ని చెల్లించిందట. ఓ కూల్ డ్రింక్ తయారీ కంపెనీలోనూ సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ 5 కోట్ల రూపాయలకు పైగా సెంట్రల్ ఎక్సైజ్ పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో పైపుల తయారీ సంస్థలపై దాడులు చేశారు. అక్కడ రెండు కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
వీటితో పాటు హైదరాబాద్ , విశాఖపట్నంలోని రెండు ఎలక్ర్టానిక్ పరికరాల విక్రయ కేంద్రాలపై.. సోదాలు నిర్వహించారు. వీటిలో ఐదు కోట్ల రూపాయల GST ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. ఇలా భారీ మొత్తాల్లో పన్ను వసూళ్ల బకాయిలు.. ఈ ఐటీ దాడులతో నిమిషాల్లో పూర్తయ్యాయట.