గత కొద్ది రోజులుగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన అనేక 'ఆకర్షణీయ' కంపెనీల కౌంటర్లలో కొనుగోలుదార్లు కరువవుతున్నారు. ప్రధాన షేర్లకే దిక్కు లేకుండా పోతోంది. సెన్సెక్స్ వరుసగా తొమ్మిదో రోజు పతనమైంది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ లు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో ఉదయం నుంచి లాభాల్లో ఉన్న మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి.
మిడ్ సెషన్ నుంచి అమ్మకాల ఒత్తిడి మొదలైంది. 10,722 నుంచి ఏకంగా 137 పాయింట్లు క్షీణించి 10,585కి పడిపోయింది నిఫ్టి. తరువాత కాస్త కోలుకుని 10,604 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 36.6 పాయింట్లు, సెన్సెక్స్ 145 పాయింట్లు క్షీణించాయి. వడ్డీ రేట్లు తగ్గింపు తరువాత మార్కెట్లో ఎన్నడూ లేని స్తబ్దత ఏర్పడింది.
హడావుడి లేకుండానే క్రమంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నారు. 9 రోజులుగా సాగుతున్న ఈ పతనంలో అనేక బ్లూచిప్ షేర్లు దెబ్బతిన్నాయి.