రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే ప్రస్తుతం ఉన్న రెపోరేటు 6.25శాతం నుంచి 6 శాతానికి దిగి రానుంది. మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం రెపో రేట్ 6 శాతం కాగా, రివర్స్ రెపో రేట్ 5.75 శాతం. రెండు నెలల్లో రెపో రేట్, రివర్స్ రెపోరేట్ 50 బేసిస్ పాయింట్లు తగ్గడం విశేషం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లు తగ్గించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపించే అవకాశముంది. వృద్ధి రేటును కొనసాగిస్తూనే వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణాన్ని 4శాతం (-/+2)వద్ద కట్టడి చేయాలని నిర్ణయించింది. మరో వారంలో లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉందనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లు తగ్గించడం సామాన్యులకు వరమే. వాస్తవానికి గతేడాది జూన్ నుంచి రెపో రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్లు తగ్గడం సామాన్యులకు లాభమే.
అమెరికాలో కూడా చివరి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో వృద్ధిరేటు కనిపించలేదని అభిప్రాయపడింది. బ్యాంకులు రుణాలు ఇచ్చేప్పుడు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR) ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఇప్పుడు రెపో రేట్ తగ్గింది కాబట్టి మరోసారి MCLR కూడా తగ్గుతుంది. అంతేకాదు... ఇప్పటికే ఉన్న రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయి.