అన్నీ అనుకున్నట్టు జరిగితే- ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇదే విషయంపై చర్చ జరుగు తోంది. ఏడు మాసాల పాలనలో అనేక సంచలనాలు, అనేక విజయాల సమాహారంగా నడిచిన 2019 వైసీపీకి హిస్టరీనే క్రియేట్ చేసింది. నలుపక్కల దాడి.. నాలుగు పార్టీలు ఏకమై.. చేసిన వ్యాఖ్యల పరంపర.. వ్యక్తిత్వ హననానికి కూడా వెరువని నాయకులు.. నేరస్తు డన్నారు.. దొంగ అన్నారు.. రాష్ట్రాన్ని దోచేసుకుంటానికే అధికారం అడుగుతున్నారని నిప్పులు చెరిగారు.. ఒక్క ఛాన్స్ మాత్రం ఎందుకు ఇవ్వాలని నిలదీశారు.. నాడు బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నాడని, కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది కనుక అలాంటి పార్టీతో సంబంధాలు పెట్టుకున్న వాడిని ఎందుకు గెలిపించాలని పోరు చేశారు.
అదే సమయంలో పక్క రాష్ట్రం కేసీఆర్తో దోస్తీ కట్టాడని, ఆయన ఏపీ ప్రజలను తిట్టారని, ఏపీ ప్రజలను హీనంగా చూస్తున్నారని అలాంటి వాడితో స్నేహం చేస్తున్న జగన్ను ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. ఇలా అనేక రూపాల్లో చేసిన దాడుల నుంచి బయటపడి.. విజయం దక్కించుకుని అప్రతిహత అసెంబ్లీ స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కిన జగన్కు ఆయన పార్టీకి నిజంగా 2019 ఓ హిస్టరీని అందించింది. ఇక, ఇప్పుడు ఆయన ముందు నిలిచింది.. అనేక ఆశలు , ఆశయాలతో దూసుకు వచ్చింది.. అనేక లక్ష్యాలను ఆయన ముందు పరిచింది.. 2020. ఒక విషయంలో కాదు.. కీలకమైన అనేక విషయాల్లో ఇప్పుడు 2020 వైసీపీకి అత్యంత కీలకం.
అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు .. మరో నెల రోజుల్లో రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం లక్ష్యంగా జగన్ పార్టీ దూసుకుపోవాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇక, అదే సమయంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా కూడా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్లాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఇక, జగన్ ముమ్మాటికీ హీరో నే అనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది. అయితే, ఈ లక్ష్యం సాధించడం, హీరో అని అనిపించుకోవడం అనేది అంత తేలిక కాదనేది విశ్లేషకుల వాదన.
అనేక న్యాయ చిక్కులు.. వివాదాలతో ముడి పడిన పోలవరం నిధులు, అమరావతి రైతుల ఆందోళన, మూడు ప్రాంతాల అభివృద్ధి.. తనపై జరుగుతున్న సీబీఐ కేసులు.. టీడీపీ వేస్తున్న ఎత్తులు పైఎత్తులు.. మిగిలిన పార్టీలన్నీ కూడా కలిసి కట్టుగా చేస్తున్న యుద్ధం.. పార్టీలో అసంతృప్తి ప్రబలకుండా చూడడంతో పాటు మరో కీలకమైన ఆర్థిక విషయంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించడం అనేది జగన్కు ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఈ క్రమంలో ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.. ఇక, హీరో నే అనేది వాస్తవం అవుతుందని అంటున్నారు పరిశీలకులు మరి ఏం జరుగుతుందో చూడాలి.