తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలపడటానికి గానూ ప్రయత్నాలు చేస్తోంది అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆ పార్టీ అక్కడ బలపడటం ఇప్పుడు ఒక కల అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో కూడా ఏ మాత్రం లెక్క లేని విధంగా వ్యవహరించిన పార్టీ అధినేత ఇప్పుడు అసలు ఆ ప్రాంతాన్ని దాదాపుగా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు టీడీపీని జాతీయ పార్టీగా మార్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే వాస్తవానికి ఇది పెద్ద జోక్ అనుకోవాలి. ఎందుకంటే తెలుగు దేశం పార్టీ ఏపీలోనే బతికి బట్ట కట్టే పరిస్థితుల్లో లేదు అన్నది వాస్తవం.
అసలు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీరు మార్చుకోక పోతే ఇప్పుడు పార్టీలో ఉన్న చాలా మంది నేతలు కూడా పార్టీలో మిగిలే పరిస్థితి లేదు. అలాంటిది బాబోరు ఏపీని వదిలేసి తెలంగాణలో పార్టీ బలపడటానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుండడం కామెడీ కాక మరేంటి అని అంటున్నారు. బిజెపి తో తెలంగాణాలో కలిసి వెళ్ళే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఒక యువనేతను నియమించే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాజకీయంగా ఇప్పుడు బలపడాలి అంటే యువనేతలు.. విద్యార్ధి సంఘాలు కావాలని బాబు భావిస్తున్నారు.
అందుకే ఇప్పుడు యువనేతల మీద ఆయన ఫోకస్ చేసారు అని సమాచారం. కొందరు యువనేతలను ఆయన పార్టీలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు అని... కాంగ్రెస్ నుంచి వచ్చిన యువనేతకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. మరి ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు చంద్రబాబు అనేది చూడాలి. ఇప్పటికే అనుబంధ సంఘాలకు క్రమంగా అధ్యక్షులను ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వస్తోన్న యువనేతకు పార్టీ పగ్గాలు అంటే ఆ యువనేత గతంలో కూడా పార్టీ మారిన వారే అని తెలుస్తోంది. ఏదేమైనా ఏపీలో పార్టీని ఎలా బతికించు కోవాలా ? అన్న ఆలోచన వదిలేసి బాబోరు తెలంగాణ గురించి ఆలోచిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.