ఏపీలో విపక్ష టీడీపీలో వరుస షాకులు. ఎవరు ఎప్పుడు పార్టీ నుంచి నిష్క్రమిస్తారో కూడా అర్థం కావడం లేదు. వీళ్లంతా నా వాళ్లే అని పార్టీ అధినేత చంద్రబాబు అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతుంటే ఆ నమ్ముకున్న వాళ్లే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. కరణం బలరాంకు చంద్రబాబుతో దశాబ్దాల అనుబంధం ఉంది.. ఆయన పార్టీ మారతారని ఎవ్వరూ ఊహించలేదు. అలాంటిది ఆయన తన కుమారుడు కరణం వెంకటేష్ భవిష్యత్తు కోసం పార్టీ మారిపోయారు. ఇక సిద్ధా రాఘవరావు కూడా టీడీపీకి, చంద్రబాబుకు ఎంతో నమ్మకస్తుడే. చంద్రబబు గీత గీస్తే ఆ గీతను సిద్ధా దాటే పరిస్థితి ఏనాడు ఉండదు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరే పార్టీ మారిపోయారు.
ఈ లెక్కన చూస్తే అసలు చంద్రబాబును నమ్మే వాళ్లు అంటూ పార్టీలో ఎవ్వరూ లేరన్నది ఓపెన్ గానే తెలుస్తోంది. ఇక పార్టీలో ఉన్న వారిలో చాలా మందికి పార్టీ మీద ప్రేమ కంటే వాళ్ల బిజినెస్ మీద ప్రేమే ఎక్కువుగా కనిపిస్తోంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లాను చూస్తే అక్కడ సిద్ధా రాఘవరావు పార్టీ మారడం వెనక ఆయన వ్యాపారాలపై ప్రభుత్వం నుంచి దాడులు ఎక్కువ కావడమే అంటున్నారు. ఆయన టీడీపీలో ఉండగా మంత్రి పదవి కూడా చేపట్టారు. ఇప్పుడు ఆయన పార్టీకి భవిష్యత్తు లేదని డిసైడ్ అయ్యి.. వ్యాపారాలను అయినా కాపాడుకోవాలనే పార్టీ మారిపోయారు.
ఇక కరణం బలరాం కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత.. నా వ్యాపారాలు.. కొడుకు రాజకీయ భవిష్యత్తే ముఖ్యం అని పార్టీ మారిపోయారంటున్నారు. ఇక గతంలో వైసీపీలో ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి గనుల వ్యాపారాలపై అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఆయన కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నా.. అక్కడ కరణం ఇప్పటికే వైసీపీలో ఉండడంతో రవి డైలమాలో ఉన్నారు. రవికి, బాలినేనికి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో రవిని కూడా నమ్మలేం అని టీడీపీ వాళ్లే అంటున్నారు. ఇక పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా పార్టీ మారతారన్న టాక్ వచ్చినా ఆయన వ్యాపారాలు ఏపీలో లేకపోవడంతో పాటు ఆయనపై ఒత్తిళ్లు తక్కువుగా ఉండడంతో స్లో అయ్యారు. టీడీపీని నమ్ముకుని కష్టాలు పడడం కంటే వ్యాపారాలు, వారసుల భవిష్యత్తు కోసమే చాలా మంది వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.