ఏపీలో అధికార వైసీపీ దూకుడు రాజకీయం చేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మరో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేయించిన ప్రభుత్వం రేపో మాపో మరి కొంత మంది టీడీపీ నేతలను టార్గెట్గా చేసుకుని అరెస్టులు చేయిస్తోందని టీడీపీ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ వాళ్ల మాటలు చూస్తుంటే రేపో మాపో మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ భవిష్యత్ సారథికిగా కీర్తించబడుతోన్న నారా లోకేష్ను కూడా అరెస్టు చేస్తారన్నట్టుగా వాతావరణం క్రియేట్ అవుతోంది. లోకేష్ అయినా, చంద్రబాబు అయినా అవినీతి చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరంటూ వైసీపీ వాళ్లు చెపుతున్నారు.
సోషల్ మీడియాలో అయితే లోకేష్ అరెస్టు అంటూ పెద్ద ఎత్తున వైసీపీ క్యాంపెయిన్ కూడా చేస్తోంది. ఓవరాల్గా టీడీపీ పాలనలో చాలా శాఖల్లో జరిగిన అవినీతికి, లోకేష్కు లింకులు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. లోకేష్ ఒత్తిడితోనే నాడు మంత్రులంతా నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ఇప్పుడు ఇరుక్కున్నారని అంటున్నారు. ఇక ఓ వైపు టీడీపీ నేతలు వరుసగా అరెస్టులు అవుతుంటే టీడీపీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇక అచ్చెన్న అరెస్టు విషయంలో బీసీ కార్డు బయటకు తీసి నానా హంగామా చేసిన టీడీపీ.. జేసీ విషయంలో ఓసీ కార్డు వాడలేదు. ఇది కూడా పార్టీలో పెద్ద గందరగోళానికి కారణమైంది.
ఇక ఇప్పుడు లోకేష్ను అరెస్టు చేస్తామని చెపుతున్నా టీడీపీ వాళ్లు బయటకు వచ్చి కౌంటర్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ చర్చ టీడీపీలో అంతర్గతంగా చాలా గట్టిగానే సాగుతోంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ టైంలో లోకేష్ అరెస్టు జరిగితే ఏం చేయాలంటూ చంద్రబాబు సతమతమవుతున్నారట. అయితే వాస్తవంగా లోకేష్ను అరెస్టు చేసినా టీడీపీ వాళ్లు స్పందించే పరిస్థితుల్లో లేరు. లోకేష్ వల్ల ఎంత మాత్రం ఉపయోగం లేదన్నదే టీడీపీలో 90 శాతం నాయకుల అభిప్రాయం. అందుకే ఇప్పుడు పెద్ద చేపలను వేటాడేలే కాని లోకేష్ గురించి పట్టించుకుంటే జగన్ టైం వేస్ట్ అయినట్టే అని వైసీపీ వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు.