ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అసలు ఏం ఆలోచన చేస్తున్నారో ? కూడా సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఓ వైపు బాబోరి మీద నమ్మకం లేక ఆ పార్టీ నేతలే కండువాలు మార్చేస్తున్నారు. చివరకు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ చెంత చేరుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు బాబుకు దూరం అయ్యారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ నుంచి మద్దాలి గిరిధర్ రావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ముగ్గురూ బాబుపై నమ్మకం లేక బాబును వదిలేసి వైసీపీ కండువా కప్పుకోకపోయినా జగన్ చెంత ఉన్నారు. వీరిలో ఇద్దరు వంశీ, బలరాం కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు.. బాబు ఎంతో నమ్మకం పెట్టుకున్న వారు కావడం గమనార్హం.
ఇక బాబోరి ప్రభుత్వంలో జరిగిన అవినీతి నేపథ్యంలో అప్పుడు మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదు కావడంతో పాటు వీరిద్దరు అరెస్టు అయ్యి కూర్చున్నారు. ఇక పార్టీ ఇంత ఘోరంగా దిగజారిపోతుంటే దీనిని సరి చేసుకోవడం మానేసిన చంద్రబాబు ఉదయం లేచిన దగ్గర నుంచి అధికార పక్షంతో పాటు సీఎం జగన్పై ఎలా బురద జల్లాలా ? అన్న ఆలోచనల్లోనే మునిగి తేలుతున్నారు. ఇక రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోతుందని తెలిసే ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యను బాబోరు పోటీ పెట్టారు. ఆ ఎన్నికల్లో వర్ల రామయ్య ఘోరంగా ఓడిపోవడం మినహా చేసేదేం ఉండదు. ఆయన్ను అనవసరంగా బద్నాం చేయడానికే పోటీ చేయిస్తున్నారని టీడీపీ వాళ్లే వాపోతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఘోర ఓటమికి బాబోరు రెడీ అవుతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అయిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద రావు తన ఎమ్మెల్సీ పదవిని వదులుకుని.. పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానానికి జూలై 19న ఉప ఎన్నిక జరగనుంది. పైగా శాసనసభ్యుల కోటాలో ఈ ఎన్నిక జరగనుంది. ఇప్పుడు వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి కేవలం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఈ సీటు కు బుర్రన్న ఎవ్వరూ పోటీ చేయరు. అయితే ఈ స్థానానికి కూడా పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకోవడంతో బాబోరు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇదేంట్రా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా జగన్ చేతిలో బాబోరు మరో ఘోర ఓటమికి రెడీ అవుతున్నారు.