అసలు ఏపీ బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉట్టికి ఎగర్లేని అమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా ఉంది. కనీసం ఒక వార్డు కూడా గెలిచే స్కోప్ లేని ఏపీ బీజేపీలో నేతలు అందరూ పెద్ద పెద్ద కబుర్లు చెపుతుంటారు. గత ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా పోటీ చేసిన ఏపీ బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచు కోలేకపోయింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి, పైడికొండల మాణిక్యాలరావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహామహులు పోటీ చేసి గెలిచారు. ఇక ఏపీలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
ఓ వర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహారావు నేతృత్వంలో కొందరు జగన్కు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారన్న టాక్ ఉంది. ఇక మాజీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఏపీ బీజేపీలోని కొన్ని కీలక టీంలు ఎప్పుడూ నడుస్తూ ఉంటాయన్నది తెలిసిందే. అందుకే ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును సైతం మోదీ & షాలు ఆఘమేఘాల మీద కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి ఆయన్ను ఉప రాష్ట్రపతిని చేసి ఆయన చేతులు కట్టేసింది.
వెంకయ్య ఎప్పుడు అయితే ఉప రాష్ట్రపతి అయ్యాడో అప్పటి నుంచి ఏపీ బీజేపీపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తోంది. గత ఎన్నికలకు ముందు కాపు వర్గానికి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినా కూడా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి కన్నా ఆధ్వర్యంలో ఏపీ బీజేపీ పిల్లి మొగ్గలు వేస్తూ వస్తోంది. తాజాగా రాజధాని అమరావతి విషయంలో అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని, అది బీజేపీ నిర్ణయమని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర పార్టీకి రాష్ట్ర శాఖ పంపింది. రాష్ట్ర నేతలు కూడా అమరావతికి అనుకూలంగానే మాట్లాడాలని సూచించింది.
ఈ క్రమంలోనే కన్నా, సుజనా చౌదరి, పురందేశ్వరి ఇతర నేతలంతా అమరావతికే తమ మద్దతు తెలిపారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దేవదర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు తలలు పట్టుకున్నారు. రైతుల ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నామంటూనే... అమరావతి రాజధానిగా ఉండాలన్నది తమ అభిప్రాయం అంటూనే.. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని చెప్పడంతో ఇప్పుడు ప్రజా సంఘాలు బీజేపీ దొంగాటపై తీవ్రంగా విరుచుకు పడుతున్నాయి. ఏదేమైనా ఏపీ బీజేపీలో ఉన్న నలుగురు నాయకులు నాలుగు గ్రూపులు వీరు అధికార పార్టీని ఏదో టార్గెట్ చేయాలనుకుని బొక్క బోర్లా పడుతున్నారని చెప్పక తప్పదు. వీళ్లను నమ్ముకుని కేంద్ర బీజేపీ నాయకత్వం ఏపీలో రాజకీయం చేయాలనుకుంటే ఈ పార్టీకి ఇక్కడ రోజుల్లోనే నూకలు చెల్లక తప్పదు.