ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే పాల‌న‌లో దూకుడు కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది ఉద్యోగాలు ఇవ్వ‌డంతో యూత్ మంచి జోష్‌లో ఉంది. నిరుద్యోగాన్ని భారీగా త‌ప్పిస్తాన‌ని ముందే చెప్పిన అనుకున్న‌ట్టుగానే ఆరు నెలల్లోనే ల‌క్ష‌లాది మంది యువ‌త‌కు వ‌లంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇక గ్రామ స‌చివాల‌యం ద్వారా ఏకంగా 1.30 ల‌క్ష‌ల‌కు పైగా యువ‌త‌కు ఉద్యోగాలు ద‌క్కాయి.

 

వీరంతా ఇప్ప‌టికే విధుల్లో చేరిపోయారు. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో వ‌రం ఇచ్చేసింది. నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చేనెలలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఇప్ప‌టికే చాలా ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నా డీఎస్సీ విష‌యంలో ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు.

 

ఇక సోమ‌వారం శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయం వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో 7,900 ఖాళీలతో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎప్పటి నుంచో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్త.

మరింత సమాచారం తెలుసుకోండి: