మన పూర్వీకుల వారసత్వ సంపదైన వేదాలను పరిరక్షించి, వేద
విద్య వ్యాప్తికి పెద్దపీట వేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఆస్థాన మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన
శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సును ఛైర్మన్ వైవీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ వేదాల్లోని విజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందేలా పండితులు కృషి చేయాలని కోరారు. వేద
విద్య నేర్చుకున్నవారికి సమాజంలో మంచి గౌరవం ఉందన్నారు.
శ్రీవారి వైభవం, పూజలు, ఉత్సవాలు తదితర అంశాలు కూడా వేదాల్లో ఉన్నాయన్నారు. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా వేదాలు మౌఖికంగా లోకానికి జ్ఞానాన్ని పంచుతున్నట్లు తెలిపారు. సదస్సుకు పాల్గొన్న వేదవిద్వాంసుల సందేశాన్ని భక్తులందరూ వినాలని కోరారు.
అనంతరం వేద విద్యార్థులు చతుర్వేద పారాయణం చేశారు. ఎస్వీ వేద వర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య కెఇ.దేవనాథన్ వేదంలో పురుషార్థాలు
అనే అంశంపై ఉపన్యసించారు. కార్యక్రమంలో టీటీడీ సీఏవో శేషశైలేంద్ర, ఎస్టేట్ అధికారి విజయసారథి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ పాల్గొన్నారు.