ఏ సీజన్లోనైనా విరివిగా లభించే అరటి పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటితో తక్షణమే శక్తి లభిస్తుంది.అరటి పండ్లు తినడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించే అరటి పండ్లలో బోలెడు పోషకాలున్నాయి. చక్కెరకేళి, అమృతపాణి... ఇలా మన దేశంలో బోలెడు రకాల అరటి పండ్లు లభిస్తున్నాయి. అరటి పండ్ల ఉపయోగాలు చూస్తే..
- అరటిలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
- అరటిలో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
- పిల్లల ఎదుగుదలకు కూడా అరటి ఉపయోగపడుతుంది.
- కండరాల బలహీనతను నివారించడంలో అరటిపండ్లు తోడ్పడతాయి.
- వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంలో.. ఎసిడిటీని దూరం చేయడంలో, అల్సర్లను తగ్గించడంలో అరటి పండు కీలక పాత్ర పోషిస్తుంది.
- అరటి పండ్లలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మలబద్ధకం సమస్య దూరం కావడానికి ఇవి ఉపయోగపడతాయి.
- డయేరియాతో బాధపడేవారు అరటి పండ్లు తింటే మంచిది. జీర్ణాశయం గోడలకు ఉండే సన్నటి పొర నాశనం కాకుండా అరటి కాపాడుతుంది.
- అరటిలో ఉన్న పోషకాలు కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కటి నిద్రపట్టేలా చేస్తాయి. నిద్రిస్తున్నపుడు రక్తపోటుని కూడా అరటి పండు నియంత్రిస్తుంది.
- అరటిలోని పొటాషియం శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. అరటి పండు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
- అరటి వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. బాగా మగ్గిన అరటి పండును మెత్తగా చేసి కొద్దిగా తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
- అరటి రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. బాగా మగ్గిన అరటి పండును నలిపి మాడుకు, జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత షాంపూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది.
- వారానికి 2-3 అరటి పండ్లు తినే మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే కనీసం రోజుకు ఒక్క అరటి పండు తిన్నా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు..