ప్రతి ముప్పై ఏళ్లకు ఒకసారి తరం మారుతుంది అంటున్నారు. ఈ లేటేస్ట్ టెక్నాలజీ యుగంలో అంత సమయం కూడా అవసరం కాకపోవచ్చు. ఒకప్పుడు నిరుద్యోగం వంటి సమస్యలతో అసలు ఉద్యోగం వస్తే చాలు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు యువత అలా కాదు.. రాత్రికి రాత్రే మిలయనీర్లు కావాలని కలలు కంటోంది.
అందుకే వారికి కష్టపడి సంపాయించుకుని రూపాయి రూపాయి కూడబెట్టి తన తండ్రి కట్టిన ఇల్లంటే చీప్ ఫీలింగ్ ఉంటోంది. రాత్రికి రాత్రి కలిసి వచ్చేయాలి. రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తాలి. ఇదీ ఇప్పటి యువత ఆలోచన. ఈ పరుగులో విరామం.. విసుగు లేవు.. సాహసమే.. అయితే ఈ ధోరణితో రెండు రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి.
కసిగా కష్టపడి సరైన మార్గంలో వెళ్లి రిస్క్ చేసిన వారు వారు ఆశించినట్టుగానే ధనవంతులు అవుతున్నారు. కానీ కొందరు మాత్రం రాత్రి కి రాత్రే కోట్లు సంపాదించాలన్న కోరికతో అడ్డదారులు తొక్కుతున్నారు. తప్పుడు మార్గాలలో వెళ్లి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు.
ఈ ఒత్తిడితో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. అందుకే నేటి యువత మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతోంది. తాము ఆశించిన దానికి ఏమాత్రం భిన్నంగా వచ్చినా.. ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు వెనుకాడటం లేదు. ఇదీ నేటి యువత వైఖరి. ఇలాంటి వారిని సకాలంలో గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పిస్తే సరైన దారిలో పెట్టొచ్చు.