ఆధునిక జీవన విధానం వల్ల మహిళల్లో సంతానలేమి సమస్య పెరిగిపోయింది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే మహిళల్లో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అతిగా జంక్‌ ఫుడ్ తింటూ.. పళ్లు తక్కువగా తీసుకునే మహిళలకు గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 


ఈ అధ్యయనం కోసం వీరు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూకే, ఐర్లాండ్ దేశాలకు చెందిన సంతానం లేని 5598 మహిళలపై పరిశోధన చేశారు. వీరి ఆహారపు అలవాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన వివరాలను బట్టి.. ఫాస్ట్ ఫుడ్ తక్కువగా తీసుకుంటూ.. పళ్లు తీసుకునే మహిళలో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్కువ సమయంలోనే గర్భం దాల్చారు. అదే సమయంలో పళ్లు తీసుకోకుండా.. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే మహిళల్లో ఆలస్యంగా గర్భం రావడం లేదా గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లడం వంటి సమస్యలు అధ్యయనంలో వెల్లడయ్యాయి. 


ఆకుకూరలు, పళ్లు, కూరగాయలు, చేపలు లాంటి ఆహారం సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ లాంటి ఆహారంతో సంతాన సామర్థ్యం తగ్గుతుందని అధ్యయనం తేల్చింది. వీటితోపాటు మద్యపానం, ధూమపానం, వయసు, శరీర తత్వం వంటివి కూడా సంతాన సామర్థ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనం తేల్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: