పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకుని మంచినటిగా గుర్తింపు పొందడానికి బాలీవుడ్ లో గత ఆరేళ్ళుగా ఆమె సినిమాలు చేస్తూ ఉన్నా ఆమెకు చెప్పుకోదగ్గ విజయాలు దక్కడంలేదు. దీనితో ఆమె చాలా సినిమాల్లో క్యామియో రోల్స్ ఐటమ్ సాంగ్స్ చేస్తూ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి తన వంవంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.
ఈమధ్య 'గరుడవేగ' సినిమాలో సన్నీలియోన్ చేసిన ఐటమ్ సాంగ్ 'డియ్యో డియ్యో డించక్ డించక్' ఆసినిమా కలెక్షన్స్ కు పెద్దగా ఉపయోగపడక పోయినా అలాంటి వ్యక్తిని లీడ్ రోల్ లో పెట్టి 150 కోట్లతో ఒక నిర్మాణ సంస్థ నిర్మించబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈసినిమాను తెలుగు తమిళం హిందీ భాషల్లోకలిపి నిర్మిస్తారని తెలుస్తోంది.
నిన్న ఈసినిమా గురించి వివరాలు అధికారికంగా వెల్లడించారు. వీసీ వడివుడియన్ అనే దర్శకుడు ఈచిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇదొక పీరియడ్ వార్ మూవీ అని చెబుతున్నారు. 'వారియర్ ప్రిన్సెస్' అవతారంలో కన్పించనున్న సన్నీలియోన్ ఆ పాత్ర కోసం ఆల్రెడీ కసరత్తులు ప్రారంభించిందట. 'ఇప్పటిదాకా సన్నీలియోన్ చేసిన సినిమాల్లో ఇది చాలా ప్రత్యేకం అని అంటున్నారు.
ఈ విషయాలను ఒక వీడియో ద్వారా సన్నీలియోన్ తెలియచేసింది. అయితే ఈసినిమా కథ వారియర్ ప్రిన్సెస్ అయినా గ్లామర్ విషయంలో ఎక్కడా లోటుండదట. టాలీవుడ్ నటుడు నవదీప్ ఈసినిమాలో మరో కీలక పాత్రలో కన్పించబోతున్నాడు అని టాక్. సన్నీ పూర్తిస్థాయి కథానాయికగా తెలుగులో నటించబోతున్న తొలి సినిమాగా మారబోతోంది. దీనితో సన్నీని కథానాయికగా పెట్టి 150 కోట్లతో సినిమా తీయడమంటే అసలు నమ్మశక్యం కాని విషయంగా ఉందని కామెంట్స్ వస్తూ ఉన్నా ఇది అధికారిక సమాచారం కావడంతో ఇటువంటి ప్రయోగం సన్నీ పై ఎందుకు చేస్తున్నారు అన్న విషయం సమాధానంలేని ప్రశ్నగా మారింది..