తెలుగు ఇండస్ట్రీలోకి ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క అచిరకాలంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన అనుష్క కెరీర్ బిగినింగ్ లో ఎక్కువ గ్లామర్ షో చేసినా..తర్వాతి కాలంలో నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అనుష్క ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. అంతే కాదు లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాధాన్య ఇచ్చిన అరుంధతి, పంచాక్షరి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.
అయితే టాలీవుడ్ లోకి కొత్తగా అడుగుపెడుతున్న హీరోయిన్లు కూడా తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్న రోజులివి. అయితే, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదమూడేళ్లవుతున్నా తాను నటించిన ఏ చిత్రంలోనూ అనుష్క ఇంతవరకు తన గొంతుతో డబ్బింగ్ చెప్పుకోలేదు. అంతే కాదు ఈ మద్య కొంత మంది హీరోయిన్లు పాటలు కూడా పాడుతున్నారు. అయితే అనుష్క మాత్రం ఇప్పటి వరకు తన వాయిస్ ఏ సినిమాలో వాడలేదు. ‘భాగమతి’ చిత్ర విజయంతో ఆనందంలో ఉన్న అనుష్కను ఈ విషయమై ప్రశ్నించగా ... ‘నా గొంతు చిన్న పిల్లల గొంతు మాదిరి ఉంటుంది.
నేను మాట్లాడే మాటలు నా పక్కనే ఉన్న వ్యక్తులకు కూడా ఒకోసారి వినిపించవు. నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుని, ఆ పాత్రల ప్రాధాన్యతను దెబ్బతీయలేను’ అని చెప్పింది.తాను నటించిన ‘అరుంధతి’ చిత్రంలోని ‘నువ్వు నన్నేం చేయలేవురా!’ అనే డైలాగ్ గురించి ఆమె ప్రస్తావించారు.
ఈ డైలాగ్ కు గాత్రమే ప్రాణమని, ఈ డైలాగ్ ను ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశానని, కానీ, ఆ స్థాయిలో చెప్పే వాయిస్ తనకు లేదని తెలిపింది. ఆమె తాజా చిత్రం ‘భాగమతి’లోని ‘ఇది భాగమతి అడ్డా’ అనే డైలాగ్ కు కూడా వాయిస్ చాలా ముఖ్యమని, అందుకు, తన గొంతు సరిపోదని అనుష్క నిర్మోహమాటంగా చెప్పేస్తుంది.