తెలుగు ఇండస్ట్రీలో కళామతల్లికి రెండు కళ్లుగా నిలిచారు..మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఈ మద్య సినీతారలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం వస్తుంది. సావిత్రి పాత్రలో మళియాళ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఫోటోలు ఈ మద్య సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..అచ్చం సావిత్రిని పోలినట్లు కనిపిస్తుంది కీర్తి సురేష్. ఇక జెమినిగణేషన్ పాత్రలో మమ్ముట్టి తనయుడు దుల్కన్ సల్మాన్ నటిస్తున్నాడు.
ఇతర ముఖ్య పాత్రలో సమంత, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు. ఇప్పుడు మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఆయన తనయుడు బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించబోతున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురువారం(మార్చి29) రామకృష్ణ స్టూడియోస్లో షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే వివాదాల జోలికి పోకుండా నిమ్మకూరులో ఎన్టీఆర్ జీవితం ప్రారంభమైనప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన పరిణామాలను ఫోకస్ చేస్తూ రాజకీయాల వైపు సాగించిన ప్రయాణం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో సినిమా ముగింపు ఉంటుందని తెలుస్తోంది. ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం.. అంటూ అన్న గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజున ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభం చేసుకోవడం మరో విశేషం.
ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు వర్దన్తో కలసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఎన్టీఆర్' అనే పేరును ఖరారు చేశారు. ఎంఎం కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు, తల్లి బసవతారకం సొంత ప్రాంతం కొమరవోలు నుండి అభిమానులను ఆహ్వానించారు బాలయ్య.