డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందిన చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి తొలిఆట నుండే నెగిటివ్ టాక్ రావడంతో తొలిరోజు కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.
పూరీ ఈజ్ బ్యాక్ అనిపిస్తారని థియేటర్స్కి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. హీరో, హీరోయిన్లు పాత్రలకు న్యాయం చేసినా కథలో కంటెంట్ లేకపోవడం.. ఉన్న కథ కాస్తా మరీ సాగదీతగా ఉండటంతో ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక ఒకవైపు ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’, ‘మహానటి’ సినిమాలు హిట్ టాక్తో దూసుకుపోతున్నాయి. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ మిక్స్డ్ టాక్తో ఓ మోస్తరు కలెక్షన్లతో పర్వాలేదనిపిస్తోంది.
ఈ సమయంలో పూరీ తన సినిమాపై ఉన్న నమ్మకంతో మే 11న (నిన్న) ‘మెహబూబా’ చిత్రాన్ని విడుదల చేశారు. తీరా రిజల్ట్ చూస్తే పూరీ అంచనాలు తలక్రిందులయ్యాయి. మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో 80 లక్షల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. గురువారం నాటి ప్రీమియర్ షోల ద్వారా 81 లొకేషన్లలో 41,900 డాలర్లను వసూలు చేసింది.
ఇక శుక్రవారం నాడు భారీస్థాయిలో తగ్గి 14,900 డాలర్లను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. దిల్ రాజు ఈ సినిమాను కొనడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగానే విడుదలైంది. శని, ఆదివారాలు కలిసి రావడంతో ‘మెహబూబా’ చిత్రం వీకెండ్లో కలెక్షన్లలో ఏమైనా రిజల్ట్ వస్తుందేమో అని చిత్ర యూనిట్ ఆశగా ఎదురు చూస్తున్నారు.