తన 14 సంవత్సరాల వయసులో నాటకరంగలోకి అడుగుపెట్టిన కరుణానిధి.. అనేక నాటకాల్లో నటించారు. కవిత్వం రాయడంలోనూ ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. వివాహానంతరం నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ నాటకాల్లోనూ ఆయన నటించారు. అప్పట్లో ప్రసిద్ది చెందిన చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘జూపిటర్ పిక్చర్స్’ నుంచి పిలుపు రావడంతో అందులో స్క్రిప్ట్ రైటర్గా కొత్త జీవితాన్ని కరుణానిధి ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తమిళ ప్రేక్షకులను కనువిందు చేశాయి.
ఆయన 39 సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. కరుణానిధి తొలిసారిగా 1947లో ‘రాజకుమారి’ అనే చిత్రానికి సంభాషణలు రాశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో ఇబ్బంది పడ్డ కరుణానిధి నిన్న సాయంత్రం కన్నుమూశారు. కరుణానిధి అస్తమించడంతో యావత్తు తమిళనాడు ప్రజానీకం శోకసంద్రంలో మునిగిపోయింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన కళైంజర్ వెండితెరపై కూడా చెరగని ముద్రవేశారు. సినీ రంగం నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి దక్షిణ భారతీయుడిగానూ కరుణానిధి చరిత్ర సృష్టించారు.
చిత్ర పరిశ్రమకు కరుణ చేసిన సేవలను తలుచుకుంటూ థియేటర్లు రెండు రోజులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఆయనపై తమ గౌరవాన్ని చాటుకుంటున్నాయి. కరుణ మరణవార్త వినగానే మంగళవారం సాయంత్రం నుంచే సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. ఆయనకు సంతాపం తెలిపిన నడిగర్ సంఘం... ‘తమిళ చిత్ర పరిశ్రమలో రచయితగా తన ప్రస్థానం ప్రారంభించిన కరుణానిధి... ఆయన రాసిన సంభాషణలు ఇప్పటి వరకూ అసమానంగా నిలిచిపోయాయి.. వీటిని తెరపై పలికిన హీరోలకు సమానంగా ఇవి ప్రాచుర్యం పొందాయి.
సినీ రచయిత రాసిన సంభాషణలు ఆయా చిత్రాల్లోని పాత్రలు తమలో తామే సంభాషించుకోడానికే పరిమితమైతే, కరుణానిధి డైలాగ్స్ మాత్రం పాత్రల పరిధి దాటి సమాజంతో సంభాషించేవని తెలిపారు. 1940, 50 వ దశకంలో అప్పటి వరకూ తమిళనాడులో పాటలే గ్రామ్ఫోన్ రికార్డుల్లో వినిపించేవి... అయితే సినిమాల్లో సంభాషణలు సైతం గ్రామ్ఫోన్ రికార్డులుగా వచ్చి ప్రజలు వాటి గురించి చర్చించుకునే స్థాయి కరుణానిధి రాసిన చిత్రాలతోనే ప్రారంభమైంది.